అల వైకుంఠపురం .. శోభాయమానంగా వెలుగొందే శ్రీ మహావిష్టువు నివాసం . అక్కడ ఆకలిదప్పులుండవు. ఆశనిరాశలూ ఉండవు. ఉన్నదొకటే .. అనిర్వచనీయమైన ఆనందం. అది నిత్యం .. అదే సత్యం. అలాంటిదే... కావలి పట్టణాన్ని ఆనుకుని ఒకటి ఉంది. బ్రతికున్నంతకాలం అలముకున్న మాయను విదిలించుకుని మోక్షం కోసం భగవంతుని ఎదుట అక్కడ మోకరిల్లుతారందరూ... చనిపోయినతర్వాత . అదే ఊరి స్మశానం .. కావలి పట్టణంలో ఎవరు చనిపోయినా వాళ్ళ జ్ఞాపకాల శిధిలాలను గుండె దిటవు చేసుకుని అక్కడ వదిలేసి కొండంత వైరాగ్యాన్ని తీసుకేళ్ళేవారు వాళ్ళ సంభందీకులు .అంతేకాదు ...ప్రతీ సంక్రాంతికి రాత్రివేళలో అక్కడకువచ్చి వాళ్ళ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ... సమాధులను పూలతో అలంకరించి దీపాలు వెలిగించి అగరుపోగల ధూపాలతో తమ ఇళ్ళలో పండుగనాడు చేసుకున్న పిండివంటలు పళ్ళు పలహారాలు నైవేద్యంగా పెట్టి అయినవారిని స్మరించుకునేవారు .. ఆ రాత్రివేళలో .. వీధి దీపాలు కూడా లేని ఆ రోజుల్లో... ఆ స్మశానప్రాంగణమంతా ఓ కలియుగ వైకుంఠంగా ఉండేది . అందుకే ఆ ఊరి పేరు వైకుంఠపురమయ్యింది . పొట్టకూటి కోసం కూలిపనులనో కులవృత్తులనో నమ్ముకున్న సమాజం .. ఆ వైకుంఠపురం చాలీ చాలని సంపాదనతో కుదించుకుపోయిన జీవితాన్ని స్వచ్చమైన భావోద్వేగాలతో ఆస్వాదిస్తూ తమ పిల్లల భవితవ్యానికి బడివైపు బాటలు వేస్తున్న కాలమది . చదువుమాత్రమే బ్రతుకులు మార్చగలదనే వాదనను అంతర్లీనంగా ఈ సంపుటిలోని ప్రతీ కధలో తెలియచేయుటమైనది. చదివి ఆస్వాదిస్తారని .. ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ----యేటూరి శ్రీనివాసులు