అది సుందరకాండ. రామాయణంలోని రమణీయ కథాగమనాల కలకండ. అదిప్పుడు మరింత సరళతరమై రాయలసీమ రేగడి నేలల సువాసనలద్దుకొని వెంకటార్యుల కలంలోంచి జాలువారింది.అది ముందే సుందరకాండ. దానికి ఇక్కడి మట్టి గొంతుక తొడిగితే, ఇక్కడి పక్షుల కలరావాలను తోడు జేస్తే, ఈ పూల సౌరభాల్ని అక్షరాలకు పులిమితే, సామెతల రుచిని వాక్యాలకు జతజేస్తే, మాండలికాల మంచిగంధాల్ని పురాణ పాత్రలకు అద్దుకొంటూ పోతే ... అది వెంకటార్యులు ఆలపించిన మృదుమధుర గానధారగా, అలతి అలతి తెలుగు పదాల సుందర కాండగా మారుతుంది. దీన్ని చదవకూడదు. గొంతెత్తి పాడుకోవాలి - కష్టాన్ని మరచేందుకైనా, ఇహలోక బంధాల విముక్తికైనా, అవ్యక్తానంద రసానుభూతికైనా.--సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిఉన్నదాన్ని లేనట్లు భావించుకుని అన్వేషణ ప్రారంభిస్తే ఉన్నదాంట్లో ఉండేవాటి ఉనికి ఆవిష్కృతమౌతుందనేది విజ్ఞానం. లేనిదాన్ని ఉన్నట్లు భావించుకుని అన్వేషణ ప్రారంభిస్తే, లేనిదాంట్లో ఉండేవాటి ఉనికి ఆవిష్కృతమౌతుందనేది సృజన. విజ్ఞానం-సృజన ఈ రెండూ పరస్పరం పూరకాలు. ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటే అత్యంత నవీనమైన పురాణకాండం పేరే సుందర కాండ. హనుమ మాటలు సమాజానికీ, చేతలు విజ్ఞానానికీ పెట్టని కోటలు. అలాంటి సుందరకాండను అచ్చతెలుగులో ఆబాలగోపాలానికీ అర్థమయ్యేలా పాడుకోవడానికి అనుగుణంగా "శ్రీ సుందరకాండ సుధా గీత" ను రచించి పంచిన శ్రీ ఎమ్ వేంకటార్యులవారు ధన్యాత్ములు. పాడుకున్న ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములే.-జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి